|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:53 PM
సింగరేణి సంస్థ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సింగరేణి ఏరియాల్లోని కార్మికుల నివాస గృహాలపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అనువైన నివాస గృహాలను గుర్తించేందుకు ఆరు నెలల క్రితమే సింగరేణి అధికారులు సర్వే నిర్వహించారు. ఎక్కడైతే చెట్లు, నీళ్ల ట్యాంకులు లేకుండా ఖాళీగా నివాస గృహాలు ఉన్నాయో.. వాటిపై ఈ ప్యానళ్లు ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సింగరేణి యాజమాన్యం గతేడాది డిసెంబర్లో ఓ సంస్థతో అగ్రిమెంట్ సైతం కుదుర్చుకుంది. పదేళ్లపాటు ఈ సంస్థనే కార్మికుల ఇళ్లపై సోలార్ నిర్వహణ బాధ్యత చేపట్టనుంది.
సింగరేణి క్వార్టర్లలో కార్మికుల గృహ విద్యుత్తు వినియోగానికి ప్రస్తుతం నెలకు సుమారుగా రూ.50 నుంచి 60 కోట్ల మేర చెల్లిస్తోంది. రూఫ్ టాప్ సౌర విద్యుత్తుతో సింగరేణికి ఆ భారం చాలా వరకు తగ్గనుంది. అన్ని ఏరియాల వ్యాప్తంగా 15 వేల కిలోవాట్ల మేర సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని సంస్థ టార్గెట్గా పెట్టుకుంది. ఇందు కోసం రూ.65 కోట్ల ఖర్చు చేయనుంది. ఉద్యోగుల గృహాలకు వినియోగించగా మిగిలిన మొత్తాన్ని గ్రిడ్కి అనుసంధానించనున్నారు. ఈ మేరకు 800 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తే లక్ష్యంగా ఇప్పటికే పలు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ ప్లా్ంట్ల ద్వారా ప్రస్తుతానికి 500 మెగావాట్ల వరకు లక్ష్యాన్ని సాధించింది. రూఫ్టాప్ సౌర విద్యుత్తు పనులు త్వరలో ప్రారంభం అవుతాయని మణుగూరు వర్క్షాపు డీజీఎం శ్రీకాంత్ తెలిపారు. సౌర ఫలకలు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని అన్నారు.
కాగా, సింగరేణి సంస్థ చేపట్టిన ఈ రూఫ్ టాప్ సౌర విద్యుత్ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా.. ప్రతి నెలా కార్మికుల గృహ విద్యుత్ వినియోగం కోసం సంస్థ వెచ్చిస్తున్న రూ. 50 నుంచి 60 కోట్ల భారం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. 15 వేల కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా సంస్థకు దీర్ఘకాలికంగా ఆర్థిక పొదుపు చేకూరుతుందని అంటున్నారు. పర్యావరణ పరంగా చూస్తే.. బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడటం తగ్గి, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని..ఇది గ్రీన్ ఎనర్జీ లక్ష్యానికి దోహదపడుతుందని వెల్లడిస్తున్నారు. గృహ అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానించడం ద్వారా అదనపు శక్తి వనరుగా మారుతుందని చెబుతున్నారు. ఇది సంస్థ ఆర్థికాభివృద్ధికే కాకుండా.. సింగరేణిని పర్యావరణ హితమైన తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.