|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 12:47 PM
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. తాను చదువుకున్న కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ, చాలా సంవత్సరాల తర్వాత ముంబైలోని తన కళాశాల వీధిలో కలియదిరిగారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. "చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నా కాలేజీ వీధికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ప్రతిరోజూ ఇక్కడే నడిచేదాన్ని" అని చెబుతూ శ్రుతి తన వీడియోను ప్రారంభించారు.కాలేజీ తర్వాత స్నేహితులతో కలిసి స్నాక్స్ తినేందుకు వెళ్లే ప్రదేశాన్ని చూపిస్తూ, అప్పుడప్పుడు అక్కడికి వెళ్లే వాళ్లం... రోజూ అక్కడికి వెళితే మాత్రం డబ్బులు మిగిలేవి కాదు అని సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం, ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న మటన్ రోల్ కోసం ఓ రెస్టారెంట్కు వెళ్లారు. కానీ, ఇప్పుడు అక్కడ అది అందుబాటులో లేదని తెలిసి నిరాశ చెందారు. "రోల్కు ఏమైంది? జీవితంలో కొన్ని విషయాలు మారిపోతాయి" అని అన్నారు.కాలేజీ రోజుల్లో తాను జుట్టుకు పింక్ రంగు వేసుకున్నందుకు ప్రిన్సిపాల్ తనను ఆఫీసుకు పిలిపించారని ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. గాయనిగా మారాలనే తన ఆసక్తి కూడా కాలేజీలోనే మొదలైందని శ్రుతి వెల్లడించారు. "చాలా నాస్టాల్జిక్గా ఫీల్ అవుతున్నాను. ఇన్నేళ్లయినా ఇక్కడ ఏమీ మారలేదు" అని తెలిపారు. ఈ వీడియోకు "జ్ఞాపకాల దారిలో ఒక ప్రయాణం" అని క్యాప్షన్ జోడించారు.
Latest News