|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 01:00 PM
టీవీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ను కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ రెండోసారి విచారించింది. సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ దాదాపు ఐదున్నర గంటల పాటు సాగింది. ఈ కేసు దర్యాప్తులో ఇది కీలక దశగా భావిస్తున్నారు.గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవడంతో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో సంబంధం ఉన్న వారిని ఢిల్లీకి పిలిపించి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. జనవరి 12న మొదటిసారి విజయ్ను ఆరు గంటల పాటు ప్రశ్నించారు.విచారణ సందర్భంగా, "ర్యాలీలో ట్రాఫిక్ రద్దీని గమనించారా? జనాన్ని నియంత్రించడంలో ఏడు గంటల ఆలస్యం ఎందుకు జరిగింది? రద్దీ ఉన్నప్పటికీ కాన్వాయ్ను ఎందుకు ముందుకు పోనిచ్చారు?" వంటి పలు కీలక ప్రశ్నలను అధికారులు విజయ్ ముందు ఉంచినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వగా, మరికొన్నింటికి పత్రాలు చూసి చెబుతానని, సమయం కావాలని కోరినట్లు తెలిసింది.విచారణ ముగిశాక, విజయ్కు మళ్లీ ఎలాంటి సమన్లు జారీ చేయలేదని టీవీకే పార్టీ అడ్మినిస్ట్రేటర్ నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు. విజయ్ను అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు.
Latest News