|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 07:47 PM
తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన కృష్ణానది నీరు తీవ్ర కాలుష్యానికి గురవుతోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో మురుగునీటిని, పారిశ్రామిక వ్యర్థాలను నిర్లక్ష్యంగా వదలడం వల్ల తాగునీటికి కూడా పనికిరాని దుస్థితి ఏర్పడింది. దీనితో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని 113 గ్రామాలకు గత 25 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఈ జిల్లాలో సాగునీరు, తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. కృష్ణానదిని కాపాడాలని, కాలుష్యాన్ని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నదీ పరీవాహక ప్రాంతాల్లో మురుగునీటిని నేరుగా నదిలోకి వదిలేస్తున్నారు. అంతేకాకుండా, రాత్రివేళల్లో పారిశ్రామిక వ్యర్థాలను, రసాయనాలను తీసుకువచ్చి రహస్యంగా నదిలో కలుపుతున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల కృష్ణానీరు తాగడానికి కూడా పనికిరాకుండా పోతోంది. దీంతో సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ జిల్లాలో గత 25 రోజులుగా 113 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీనితో ఆయా గ్రామాల్లోని వేలాది కుటుంబాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. వ్యవసాయానికి, తాగడానికి కృష్ణానీటిపైనే ఆధారపడిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిని శుభ్రపర్చాలని, కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (ఫేజ్ I) లో భారీ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నేడు అనగా డిసెంబర్ 27, శనివారం ఉదయం 6 గంటల నుంచి 28 ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది.
నగర ప్రజలకు మంచి నీరు అందిస్తోన్న గండిపేట జలాశయంలో కలుషితాలు కలుపుతున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందని, తాజాగా ఓ సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ని పట్టుకున్న స్థానికులు అధికారులకు అప్పగించారు. అలానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తాగే నీళ్లలో మనుషుల వ్యర్థాలు అన్లోడ్ వ్యవహారంపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు)పై విమర్శలు చేస్తున్నారు.