|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:39 PM
తెలంగాణ ప్రభుత్వం 'ఇందిరమ్మ చీరల' పంపిణీ పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అయితే.. ఈ పథకం వెనుక పెద్ద మోసం దాగి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఈ పథకంపై మహిళలను అప్రమత్తం చేశారు. 'ప్రభుత్వం మీకు ఇచ్చే ఈ ఇందిరమ్మ చీరలు ఉచితం కావు. ఒక్కో చీర పేరుతో మీ పేరు మీద రూ. 1,200 అప్పు రాస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది.' అని ఆయన మండిపడ్డారు. ఈ చీరల పంపిణీ సమయంలో మహిళల నుంచి ఆధార్ కార్డు వివరాలు సేకరించడం, వేలిముద్రలు తీసుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఇదేనని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం ఆడంబరంగా చీరలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. భవిష్యత్తులో మహిళలకు షాక్ ఇవ్వబోతుందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. 'ఈ రోజు ఉచితమని చెప్పి చీరలు ఇస్తున్నారు కానీ, రేపు అదే మహిళలకు ఆ డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తారు. మీరు తీసుకున్న చీరలకు బాకీ పడ్డారని ఆ మొత్తాన్ని వసూలు చేసే ప్రమాదం ఉంది.' అని ఆయన మహిళలను హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి డేటా సేకరణ లేకుండా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న బతుకమ్మ చీరల స్థానంలో 'ఇందిరమ్మ చీరల'ను ప్రవేశపెట్టింది. పౌర సరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నామంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఇది అప్పుల ఊబిలోకి నెట్టడమేనని విమర్శిస్తున్నాయి. ఈ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో సాధారణ మహిళల్లో కొంత అయోమయం నెలకొంది. లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకోవడం కేవలం పారదర్శకత కోసమేనని అధికార పక్షం వాదిస్తుండగా.. అది అప్పు నమోదు కోసమేనని ఎర్రబెల్లి లాంటి నేతలు అంటున్నారు.