|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 11:54 AM
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో యువ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు బంగారంతో తులాభారం వేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబం సమేతంగా మేడారం వచ్చిన టీనా శ్రావ్య, తన పమేరియన్ జాతికి చెందిన కుక్కకు 'బంగారం' తులాభారం వేశారు. భక్తులు తమ మొక్కులు తీరిన సందర్భంగా సమ్మక్క, సారలమ్మలకు 'బంగారం' సమర్పించడం ఆనవాయతీ. ఇక్కడ 'బంగారం' అంటే బెల్లంను తూకం వేసి సమర్పించడం.సాధారణంగా భక్తులు అమ్మవార్లకు 'బంగారం' సమర్పిస్తుంటారు. అయితే, టీనా శ్రావ్య చేసిన పనిపై విమర్శలు రావడంతో ఆమె స్పందించారు. తన కుక్క అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కోలుకుంటే అమ్మవార్లకు 'బంగారం' సమర్పిస్తానని మొక్కుకున్నానని ఆమె తెలిపారు. ఆ కారణంగానే ఇలా చేశానని, గిరిజన సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరుతూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు.