|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:46 PM
క్యాన్సర్ చికిత్స రంగంలో హైదరాబాద్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణతో కీలక ముందడుగు వేశారు. చర్మ క్యాన్సర్ (మెలనోమా)ను దుష్ప్రభావాలు లేకుండా అత్యంత సమర్థవంతంగా నాశనం చేసే ఒక వినూత్న విధానాన్ని అభివృద్ధి చేశారు. ఐఐటీ-హైదరాబాద్ (IIT-H), సీఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) పరిశోధకులు సంయుక్తంగా ఈ ఘనత సాధించారు.ఈ నూతన విధానంలో బంగారు పూత పూసిన కాల్షియం పెరాక్సైడ్ నానో కణాలను (CPAu-NPs) ఉపయోగిస్తారు. వీటిని శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు, అవి నేరుగా క్యాన్సర్ కణాలకు అతుక్కుంటాయి. ఆ తర్వాత ఫొటోథర్మల్ థెరపీ (PTT) ద్వారా ప్రత్యేక కాంతిని క్యాన్సర్ ఉన్న ప్రదేశంపై ప్రసరింపజేస్తారు. దీనివల్ల నానో కణాల్లోని బంగారం వేడెక్కి విపరీతమైన ఉష్ణాన్ని పుట్టిస్తుంది. అదే సమయంలో కాల్షియం పెరాక్సైడ్ నుంచి ఆక్సిజన్ విడుదలై క్యాన్సర్ కణాలను మరింతగా దెబ్బతీస్తుంది.ఈ పద్ధతిలో ఆరోగ్యకరమైన కణాలకు దాదాపు ఎలాంటి నష్టం జరగదని శాస్త్రవేత్తలు తెలిపారు. బాధాకరమైన కెమోథెరపీ, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల అవసరం లేకుండానే క్యాన్సర్ను నయం చేయడానికి ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా, క్యాన్సర్ రోగుల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా ఈ నానో కణాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని తేలింది.ఐఐటీ హైదరాబాద్ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ అరవింద్ కుమార్ రంగన్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో క్యాన్సర్ కణితుల పరిమాణం గణనీయంగా తగ్గిందని పరిశోధకులు గుర్తించారు.