|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 03:00 PM
అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి చేసిన ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు.ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ శారీరక దాడికి దిగడమనేది... కాంగ్రెస్ ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందని కేటీఆర్ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్కు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.