|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 08:00 PM
తెలంగాణ కుంభమేళాగా పిలిచే అతిపెద్ద గిరిజన ఉత్సవం సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లులుగా కొలిచే ఆ వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మేడారం జాతరపై ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. భక్తి, జనాలు ఎక్కువగా ఉండే చోట పెను సంచనలం జరగబోతుందని చెప్పారు. అది మేడారం జాతరే కావొచ్చు.. ఆలయాలే కావొచ్చునని అన్నారు. తాను శాస్త్రంలో ఉన్నదానినే చెబుతున్నానని వ్యాఖ్యనించారు.
'గతేడాది ఇదే ఛానెల్కు నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఈ ఏడాది (2025) రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పా. విమాన ప్రమాదాలు కూడా ఎక్కువ అని చెప్పా. దానికి నాపై నెగిటివ్ ట్రోల్స్ చేశారు. ఎప్పుడూ నెగిటివ్ చెబుతాడని తిట్టారు. కానీ నేను చెప్పినట్లు జరిగాయి. ఈ ఏడాది గురువు అధిపతి.. కమాండర్ కేతువు. అన్నీ క్లియర్గా ఉన్నయ్. కేతువు అంటే మోక్షకారకుడు.. భక్తి కారకుడు. ఈ ఏడాది 2026లో ఎక్కడైతే జనాలు ఎక్కువగా గూమి కూడి ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తయ్. అది రేపు జరగబోయే పుష్కరాలు కావొచ్చు.. సమ్మక్క సారక్క జాతరలో కావొచ్చు.. దేవాలయాల్లో కావొచ్చు. ఎక్కడైతే భక్తి భావం ఉంటుందో అక్కడ పెను సంచలనం జరిగే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. అదే శాస్త్రాన్ని నేను చెబుతున్నా. ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా మంది బాధలు పడుతుంటారు. కలియుగంలో దాని తీవ్రత చాలా ఎక్కువ. 2025లో అనుభవించిన కష్టాల కంటే 2026లో అనుభవించే కష్టాలు ఎక్కువ. ప్రకృతిలో జరిగే ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుంది. ప్రకృతిపరంగా.. సామాజికంగా.. అగ్నిప్రమాదాల పరంగా.. వాహనాలపరంగా.. చాలా రకాల సమస్యలు ఈ ఏడాది ఉండబోతున్నాయి.' అని వేణుస్వామి వెల్లడించారు.
కాగా, మేడారం జాతరలో భాగంగా.. జనవరి 27న పగిడిద్దరాజు, జంపన్న మేడారానికి పయనమవడంతో జాతర సందడి మొదలవుతుంది. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు వచ్చి గద్దెలపై కొలువుదీరుతారు. జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం జనవరి 29న చోటుచేసుకోనుంది. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తుల పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి మొత్తం దద్దరిల్లుతుంది. జనవరి 30న భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ దేవతలకు సమర్పించే నిలువెత్తు బంగారం (బెల్లం)తో గద్దెలు నిండిపోతాయి. జనవరి 31న దేవతల వనప్రవేశంతో ఈ మహాజాతర ముగుస్తుంది. చివరగా ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తమవుతాయి. ఈ జాతరలో దాదాపు కోటికి పైగానే భక్తులు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.