|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 05:36 PM
ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్) తాజాగా ప్రకటించింది. పాలనాపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నైనీ కోల్ మైన్స్ టెండర్ల విషయంలో ఇటీవల తీవ్ర ఆరోపణలు రావడంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, గనుల శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందించి టెండర్లు రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.షెడ్యూల్ ప్రకారం.. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా టెండర్ రద్దు చేస్తున్నట్లు ఎస్ సీసీఎల్ ప్రకటించింది. మరోవైపు, నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సింగరేణి పాలకమండలిని ప్రశ్నించింది. టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని, సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ నిలదీశారు. టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు వివరణ ఇచ్చారు.