![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 05:54 PM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. నేడు వివిధ శాఖల పద్దులపై సభలో చర్చ కొనసాగుతోంది. అయితే సోమవారం సభలో తాను చేసిన కామెంట్ల వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మనసు కష్టపడితే తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. సునీతా లక్ష్మారెడ్డి అంటే తనకు గౌరవమని అన్నారు. మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని.. తనకూ 8 మంది సిస్టర్స్ ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా సునీతా లక్ష్మారెర్డిని తాను ఏమీ అనలేదని.. ఒక వేళ ఆమె మనసుకు బాధ కల్గించి ఉంటే తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటానని అని స్పీకర్ వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా గందరగోళం నెలకొంది. చాలా మంది సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏమాత్రం అర్థం కాలేదు. మధ్యలో కలుగజేసుకున్న స్పీకర్.. 'సభలో రన్నింగ్ కామెంట్రీ జరుగుతోంది. నాకేం వినాలనిపించటం లేదు.. మీకైనా వినాలనిపిస్తుందా..?' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి మాట్లాడినవేనని సునీతా లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇవాళ సభ ప్రారంభం కాగానే స్పీకర్ వ్యాఖ్యలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్పీకర్ స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేస్తారనుకోలేదని చెప్పారు. తాను ఎక్కడా పరిధి దాటి మాట్లాడలేదని, సబ్జెట్ డివీయేట్ కాలేదన్నారు. అయినా తన పట్ల స్పీకర్ అలా మాట్లాడటం చాలా బాధేసిందన్నారు. తన విషయంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు మంచివే అనిపిస్తే రికార్డులో ఉంచాలని లేదా వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.
దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్..తాను ఎవరిని ఉద్దేశించి అలా అనలేదని చెప్పారు. తన మాటాలను పొరపాటుగా అర్ధం చేసుకున్నారని.. తనకు మహిళలంటే గౌరవం ఉందని చెప్పారు. తనకు 8 మంది సిస్టర్స్ ఉన్నారని చెప్పారు. కావాలని తాను ఏ ఒక్కర్నో ఉద్దేశించి అలా అనలేదని.. రన్నింగ్ కామెంట్రీ ఇస్తుండటంతోనే అలా అనాల్సి వచ్చిందని అన్నారు. ఒక వేళ తన వ్యాఖ్యల వల్ల సునీతా మనసు బాధ కలిగి ఉంటే ఆ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నానని సభలో వెల్లడించారు.