|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 07:54 AM
ఇల్లరికం తెచ్చుకున్న అల్లుడే అత్తపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నేళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించింది. అయితే అల్లుడు మద్యానికి బానిసై తరచూ కుమార్తెను వేధింపులకు గురిచేస్తుండటంతో.. అతడిని అత్త ఇంటికి ఇల్లరికంగా తెచ్చుకుంది. అయితే, ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడు అత్తపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం తీవ్రంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరుగుపొరుగువారు విషయం గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి రెండో కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.