|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 07:03 PM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే రాష్ట్రంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బాబూ జగ్జీవన్రామ్ భవన్లో జరిగిన గురుకుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.చదువుకు ఉన్న ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, "చాలామంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు, చదువు మాత్రమే. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది" అని సీఎం అన్నారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలు, అసమానతలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కోఠిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తుచేశారు.కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే, వారు చదువుకునే పరిసరాలు, మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమని సీఎం వ్యాఖ్యానించారు.గత పాలకుల వైఖరిని విమర్శిస్తూ, "ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు చదువులు వద్దని, వారు కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారు. దళితులు, బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సీఎం వ్యవహరించారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువత ఆశలపై గత ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆయన విమర్శించారు. "మాజీ ముఖ్యమంత్రి తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు" అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ, ఇంకా లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. "నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. ఆరు నెలలు కూడా విరామం లేకుండా వాళ్ల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారు" అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.