|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 03:49 PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తుండగా, అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ తన పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ సత్తా చాటుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, ఎంఐఎం 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. జోకిహత్ (అరారియా), కోచాధామన్ (కిషన్గంజ్), అమౌర్ (పూర్ణియా), బైసి (పూర్ణియా), ఠాకూర్గంజ్ (కిషన్గంజ్), బహదూర్ గంజ్ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వీటిలో నాలుగు స్థానాలను 2020 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలుచుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవగా, వారిలో నలుగురు ఆర్జేడీలో చేరిపోయారు. పార్టీతో మిగిలిన ఏకైక ఎమ్మెల్యే, అమౌర్ అభ్యర్థి అక్తరుల్ ఇమాన్ ఈసారి కూడా తన స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇండియా కూటమిలో చోటు దక్కకపోవడంతో, రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవాలని ఎంఐఎం గట్టిగా ప్రయత్నించింది. తొలుత 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా, చివరకు ఇద్దరు ముస్లిమేతరులతో సహా 25 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.