|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 11:28 AM
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ప్రచారంలో పాల్గొన్నారు. అదివారం తన స్వగ్రామం చిట్కుల్ నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ 5,6, వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటిఇంటికి ప్రచారం సాగించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 6 గారంటీలను అమలు చేస్తూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని దగ్గర చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని వివరించారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో నిర్లక్ష్యం చేయబడిన అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడని తెలిపారు.నూతనంగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ నిధులతో ప్రజలకు కావలసిన రోడ్లు, డ్రైనేజీలతో పాటు తాగునీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణాలు మొదలు పెడతామన్నారు. ఈ ప్రాంత ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మన ప్రాంత అభివృద్ధికి విశేషంగా సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ అభ్యర్థి సుంకరి రవీందర్, 5వ వార్డ్ అభ్యర్థి సంగన్నగారి జ్యోతి, కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..