|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 11:50 AM
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం సమకూరింది. ఖమ్మం, ఇల్లెందు, ఏటూరినాగారం, చర్ల, వెంకటాపురం, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, మంగపేట ప్రాంతాల నుంచి 214 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ బస్సుల్లో 2 లక్షల మంది భక్తులు మేడారానికి రాకపోకలు సాగించారు. ఖమ్మం డిపో నుంచి 41 బస్సులతో 318 ట్రిప్పులు నిర్వహించగా రూ. 60,66,398 ఆదాయం లభించింది. సత్తుపల్లి డిపో నుంచి 26 బస్సులు ఏర్పాటు చేసి 749 ట్రిప్పులు నడిపించగా రూ. 74,44,937 ఆదాయం వచ్చింది. భద్రాచలం డిపో నుంచి 36 బస్సులు, కొత్తగూడెం డిపో నుంచి 90 బస్సులు, మణుగూరు డిపో నుంచి 21 బస్సు సర్వీసులు కలిపి మొత్తం 147 సర్వీసులు నడిపారు. ఈ మూడు డిపోల ద్వారా మొత్తం 1,172 ట్రిప్పులు నిర్వహించారు. ఇందులో భద్రాచలం డిపోకు రూ. 46,91,726, కొత్తగూడెం డిపోకు రూ. 1,07,02,941, మణుగూరు డిపోకు రూ. 39,33,179 ఆదాయం సమకూరింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు డిపోల నుంచి 214 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయగా, 2,040 ట్రిప్పులకు గాను రూ. 3,28,39,181 ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా ప్రత్యేక సర్వీసులు నడిపి సంస్థకు గణనీయమైన ఆదాయం చేకూర్చడంలో సహకరించిన ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి అధికారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.