![]() |
![]() |
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 07:06 PM
ప్రైవేటు హాస్టల్సే ఆ కేటుగాళ్ల టార్గెట్. చడీ చప్పుడు లేకుండా సైలెంట్గా వస్తారు. పని కానిచ్చేసి అక్కడ్నుంచి జారుకుంటారు. ఈజీ మనీకి అలవాటుపడిన ఇద్దరు కేటుగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. హాస్టల్స్ను లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. ఈ మేరకు నిఘా ఉంచిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 51 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10.20 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఎస్సార్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్కు చెందిన గోవింద్ భండారి(24), హిక్మత్ రావల్(23) బావ, బావమరుదులు. ఆరేళ్ల క్రితం ఉపాధి కోసం నగరానికి వచ్చారు. స్థానికంగా ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో పనిచేస్తున్నారు. అయితే ఈజీగా డబ్బు సంపాదించాలనే దుర్భుద్ధితో దొంగతనాల బాట పట్టారు. తెల్లవారుజామున భండారి ఒక్కడే వచ్చి ప్రైవేటు హాస్టల్ గదుల్లో బస చేసినవారు. అందులో ఉండేవారు నిద్రలో ఉండగా సెల్ఫోన్లను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించేవారు. వాటిని హిక్మత్ రావల్ వద్ద దాచేవాడు. అనంతరం సెకండ్ హ్యాండ్లో ఓ వ్యాపారికి వాటిని విక్రయించేవారు.
అయితే ఎస్సాఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రైవేటు హాస్టల్స్లో వరుసగా సెల్ఫోన్లు చోరీకి గురవుతుండటంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు నిఘా పెంచారు. అనిమాత వ్యక్తులపై ఫోకస్ పెట్టారు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఈ క్రమంలో నిందితులను గుర్తించి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో వారిని పట్టుకున్నారు. భండారి చోరీకి వచ్చిన ప్రతిసారి ర్యాపిడో బైక్పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. బైక్ నెంబరు ట్రేస్ చేయడం ద్వారా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 51 సెల్ఫోన్లు సీజ్ చేశారు. వాటి విలువ రూ. 10 లక్షలకు పైగానే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రైవేటు హాస్టల్స్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెబుతున్నారు. నగరంలో ఈ తరహా గ్యాంగులు మరికొన్ని తిరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.