|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:18 PM
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారిని వేధిస్తున్న వార్డెన్ కిషన్ నాయక్ ఏకంగా వారిని అంతమొందించాలని చూడటం సంచలనం సృష్టించింది. వార్డెన్ తీరుపై విసిగిపోయిన విద్యార్థులు గురువారం రాత్రి కడ్పల్-సిర్గాపూర్ రహదారిపై ఆందోళనకు దిగారు. అధికారులు హాస్టల్కు వచ్చి విచారణ జరపగా, విద్యార్థులు వార్డెన్పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.దీంతో ఆగ్రహానికి గురైన వార్డెన్, శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి చేరుకుని విద్యార్థులపై బూతులతో రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా, హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి.. "నా మీదనే ఫిర్యాదు చేస్తారా? వాళ్ల అన్నంలో విషం కలిపి చంపేయండి" అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ బయటకు రావడంతో సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఉదంతంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాలని చూసిన వార్డెన్ కిషన్ నాయక్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.