|
|
by Suryaa Desk | Sat, Mar 22, 2025, 12:45 PM
జనాభా ప్రతిపాదికన కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో ఈరోజు (మార్చి 22) ఉదయం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి స్టాలిన్ అధ్యక్షత వహించగా... పలువురు తమిళనాడు మంత్రులు, డీఎంకే నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ... ‘‘ప్రస్తుత జనాభా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు. మనమందరం దానిని వ్యతిరేకించడంలో దృఢంగా ఉండాలి... పార్లమెంట్లో ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గడంతో, మన అభిప్రాయాలను వ్యక్తపరిచే బలం తగ్గుతుంది’’ అని అన్నారు.
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ... ‘‘దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించడానికి గణనీయమైన ప్రయత్నాలు చేశాయి. దేశం లక్ష్యంగా పెట్టుకున్న స్థిరమైన జనాభా పెరుగుదలను సాధించాము. మరికొన్ని రాష్ట్రాలలో వేగవంతమైన జనాభా పెరుగుదల ఉన్నప్పటికీ... మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాము. ఫలితంగా మనం ప్రతిఫలం పొందే బదులు, ఇప్పుడు మన రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని పేర్కొన్నారు.తెలంగాణ నుంచి టీ కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఈ సమావేశానికి హాజరైనవారిలో ఉన్నారు. టీ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. ఇక, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ బి వినోద్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్రెడ్డి హాజరయ్యారు. మరోవైపు ఆంధప్రదేశ్లోని ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, వైసీపీలు... స్టాలిన్ నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉన్నాయి. అయితే టీడీపీ, జనసేన, వైసీపీలకు స్టాలిన్ తరఫున డీఎంకే నేతలు వేర్వేరుగా ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేనలు ఎన్డీయే కూటమిలో భాగంగా ఉండటంతో.. ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా తెలిసింది. ఇక, ఈ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండటానికి గల కారణం తెలియరాలేదు. ఇదిలాఉంటే, తృణముల్ కాంగ్రెస్కు ఆహ్వానం పంపినప్పటికీ ఆ పార్టీ దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.