![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 09:21 PM
వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా మనకు మేలు చేస్తుందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం (జీఐబీఎఫ్) ఆధ్వర్యంలో పార్క్ హయత్లో నిర్వహించిన "ఇండియా-లాటిన్ అమెరికా, కరేబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్" రెండో ఎడిషన్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారని అన్నారు. ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకొని ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలంగాణ ఎంఎస్ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటేలా ప్రత్యేక పాలసీని తీసుకువచ్చామన్నారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు. జహీరాబాద్ నిమ్జ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరు అంతర్జాతీయ స్థాయి సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇందులో మూడు కొరియా కంపెనీలు ఉన్నట్లు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి, పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు.