|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:23 PM
మావోయిస్టు పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొంతమంది కేడర్ కూడా జనజీవన స్రవంతిలో కలిసినట్లు సమాచారం.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులకు ఓ పిలుపునిచ్చారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పౌర సమాజంలో కలిసిపోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ఆజాద్ లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన సాంబయ్య, 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయన తలపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డును ప్రకటించింది. ఆజాద్ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.