|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:15 PM
హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీ-హబ్ ప్రాంగణంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలనే నిర్ణయంపై తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. స్టార్టప్ల కేంద్రంగా, ఆవిష్కరణలకు నిలయంగా ఉన్న ఈ భవనంలో ఇతర కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల దాని ప్రాధాన్యత దెబ్బతింటుందన్న ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలు ప్రస్తుతం ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి ఏటా కోట్ల రూపాయల అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి ఆఫీసులను మార్చాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాయదుర్గంలోని టీ-హబ్ భవనంలో సుమారు 60 వేల చదరపు అడుగుల స్థలాన్ని వాణిజ్య పన్నుల శాఖ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల కోసం కేటాయించాలని అధికారులు భావించారు. అయితే, ఈ ప్రతిపాదనపై పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ నిర్వాహకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. టీ హబ్ అంశంపై వస్తున్న వార్తలపై వెంటనే స్పందించారు. అమెరికా నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడిన సీఎం.. టీ-హబ్ను కేవలం స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగించాలని స్పష్టం చేశారు. ఐటీ , ఇన్నోవేషన్ రంగాలకు కేటాయించిన ఈ ప్రాంగణంలో సాధారణ ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయవద్దని.. అలాంటి ఆలోచనలు ఉంటే వెంటనే విరమించుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న 39 కీలక కార్యాలయాలను గుర్తించిన ప్రభుత్వం.. వాటిని ఇతర ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలకు తరలించాలని సూచించింది. ఆర్థిక, రవాణా, రెవెన్యూ, అటవీ వంటి శాఖల కార్యాలయాలను అద్దె భారానికి దూరం చేస్తూనే.. టీ-హబ్ వంటి ప్రత్యేక ప్రాంగణాల పవిత్రతను కాపాడాలని సీఎం నిర్ణయించారు. రతన్ టాటా వంటి దిగ్గజాలచే ప్రారంభించబడిన ఈ కేంద్రం ద్వారా ఎన్నో యూనికార్న్ కంపెనీలు పుట్టుకొచ్చేలా చూడాలని.. అందుకే అక్కడ ప్రతి అంగుళం టెక్నాలజీ అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.