|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 01:25 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ తీవ్రంగా స్పందించారు. దేశ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ తన తల్లిని ఏమీ చేయలేరని, ఆమెను కనీసం తాకలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హసీనాకు విధించిన మరణశిక్ష తీర్పు ఒక ప్రహసనమని, దాన్ని అమలు చేసే అవకాశం లేదని ఆయన కొట్టిపారేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. "యూనస్ నా తల్లిని ఏమీ చేయలేరు. చట్టబద్ధమైన పాలన వచ్చినప్పుడు ఈ మొత్తం ప్రక్రియ రద్దయిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్నదంతా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం" అని అన్నారు. కష్టకాలంలో తన తల్లి ప్రాణాలను కాపాడుతున్నందుకు భారత ప్రభుత్వానికి వాజెద్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.విచారణ ప్రక్రియ జరిగిన తీరును వాజెద్ తీవ్రంగా తప్పుపట్టారు. "ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉంది. పార్లమెంటు లేకుండానే చట్టాలను సవరించి ఈ విచారణను వేగవంతం చేశారు. ట్రైబ్యునల్లోని 17 మంది న్యాయమూర్తులను తొలగించి, తన తల్లిపై ద్వేషం ఉన్న వ్యక్తిని న్యాయమూర్తిగా నియమించారు. ఇది స్పష్టంగా పక్షపాతంతో కూడుకున్నది" అని ఆరోపించారు. తన తల్లికి సొంత లాయర్ను నియమించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని, ప్రభుత్వమే లాయర్లను నియమించిందని ఆవేదన వ్యక్తం చేశారు.