|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 09:00 PM
రేపే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రత్యర్థులు సోషల్ మీడియాలో తీవ్రంగా వేధింపులకు పాల్పడటంతోనే మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. అధికార పార్టీ నేతలు, శ్రేణుల వేధింపుల కారణంగానే మహదేవప్ప ప్రాణాలు తీసుకున్నాడని.. బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్చందర్రావులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప మృతి బాధాకరమని పేర్కొన్న మంత్రి వాకిటి శ్రీహరి.. ఆయనను కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు బెదిరించారని బీజేపీ శ్రేణులు చెప్పడం విడ్డూరమని అన్నారు. మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను కనిపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిజం నిప్పు లాంటిదని దాన్ని ఎవరు ఆపలేరని పేర్కొన్నారు. తన వల్లే మహదేవప్ప చనిపోయాడని చెప్పడం బాధాకరమని పేర్కొన్న మంత్రి వాకిటి శ్రీహరి.. ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలిసిన తర్వాత ఎవరైనా శిక్షకు అర్హులని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు తాను మహదేవప్పతో మాట్లాడి ఉంటే.. తనకు ఎలాంటి శిక్ష వేసినా అనుభవిస్తానని వెల్లడించారు. చనిపోయిన వ్యక్తిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. తాను ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు. ఈ వ్యవహారంలో గంట గంటకు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు.
చట్టం ముందు అందరూ సమానులేనని.. ప్రజలు చాలా విజ్ఞులు అని.. పైన దేవుడు ఉన్నాడని మంత్రి వాకిటి శ్రీహరి గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని వెల్లడించారు. చనిపోయిన మహదేవప్ప కుటుంబానికి అండగా నిలబడకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా బీజేపీ అగ్రనేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అందరం కలిసి మెలిసి సంతోషంగా తిరిగామని చెప్పారు. ఈ కేసులో నిజం బయటకు వచ్చిన రోజు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.
మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డు పరిధిలో బీజేపీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేస్తున్న చందాపూర్ గ్రామానికి చెందిన మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే సోషల్ మీడియాలో వేధింపుల కారణంగానే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య సత్తెమ్మ ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. అభ్యర్థి మృతితో మక్తల్ ఆరో వార్డు ఎన్నికను ఎన్నికల అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.