|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 09:25 PM
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు రేపటి నుండి.. అంటే మే 1వ తేదీ నుండి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాలకు మే 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు సెలవులు వర్తిస్తాయి. ఈ వేసవి విరామ సమయంలో.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందే గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషకాహారాన్ని వారి ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రత్యేక ఏర్పాట్ల ప్రకారం.. అంగన్వాడీ పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు టేక్ హోం రేషన్ విధానం ద్వారా గుడ్లు .. ఇతర పోషక విలువలు కలిగిన సరుకులను అందిస్తారు. తద్వారా వేసవి సెలవుల్లో కూడా వారికి సరైన పోషకాహారం అందుతుంది. అయితే.. అంగన్వాడీ టీచర్లకు ఈ సెలవుల సమయంలో ఇతర ప్రభుత్వ విధులు నిర్వర్తించే బాధ్యతలను అప్పగించనున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే నిర్వహించడం, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం.. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా చేరే పిల్లలను గుర్తించడం వంటి పనులను చేయవలసి ఉంటుంది. ఈ చర్యల ద్వారా.. వేసవి సెలవుల సమయంలో కూడా అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మరియు బలహీన వర్గాల పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కీలకమైన పోషకాహార మద్దతును అందిస్తాయి. ఈ కేంద్రాలు పిల్లల ప్రాథమిక విద్య , ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వేసవి సెలవుల కారణంగా కేంద్రాలు మూతపడినప్పటికీ.. ప్రభుత్వం లబ్ధిదారులకు పోషకాహారాన్ని నిరంతరంగా అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయం. అలాగే.. అంగన్వాడీ టీచర్లను ఇతర విధుల్లో వినియోగించడం ద్వారా మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ చర్యలు ప్రభుత్వ చిత్తశుద్ధిని.. ప్రజల సంక్షేమం పట్ల దాని నిబద్ధతను చాటుతున్నాయి.