|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 09:51 PM
హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొండంగల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచానంటే దానికి కారణం వీర శైవ లింగాయత్ సోదరుల మద్దతే కారణమన్నారు. తన నియోజకవర్గంలో అత్యంత ప్రభావంతమైన సమాజంగా వీర శైవ లింగాయత్లు ఉన్నారన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ షెట్కార్కు నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి తన మంత్రివర్గంలో మంత్రిని చేయాలనే కోరిక ఉండేదన్నారు. అందుకే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా ఒప్పించానన్నారు. కానీ ఆయనే పెద్ద మనసు చేసుకొని.. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఒక్క సీటు ఓడినా ప్రజా ప్రభుత్వం రాదేమోనన్న ఆలోచనతో మిత్రుడు సంజీవ రెడ్డికి తన చేతికొచ్చిన బీఫాంను ఇచ్చినట్లు చెప్పారు. ఇవాళ రేపు వార్డు మెంబర్ కూడా పక్కనోళ్లకు ఇవ్వరని.. అలాంటిది పార్టీ గెలుపు కోసం తన ఎమ్మెల్యే బీఫాంను కూడా సురేష్ షెట్కార్ త్యాగం చేసి గెలిపించారన్నారు. అందుకే ఆయన్ను గౌరవిస్తూ.. జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి పార్లమెంట్కు పంపామన్నారు.
ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ను విలన్గా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అభివర్ణించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏడు దశాబ్దాల కలను నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ విలన్ ఎలా అవుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభకు తాము పూర్తిగా సహకరించామని, ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని సూచించారు. రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలు కొనసాగుతున్నాయని, కేసీఆర్కు అవి కనిపించడం లేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుందని.. కేసీఆర్ ఫామ్హౌస్కు పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. వరంగల్ సభతో పాపాలు కడుక్కోవాలని చూసినా.. చేసిన పాపాలు పోవని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.