by Suryaa Desk | Sun, Sep 22, 2024, 01:16 PM
సిరిసిల్ల జిల్లా: అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని శనివారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కలెక్టర్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, వీటికి అలవాటు పడితే ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, అనేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు మీడియా, సోషల్ మీడియాతోపాటు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం లైన్ డిపార్ట్మెంట్స్ ఒకటిగా కలిసి పని చేయాలని తెలిపారు. ప్రతి స్కూల్, కాలేజీలలో మత్తు పదార్ధాల నిర్ములనకు కమిటీలను కొనసాగిస్తూ, విద్యార్థులకు అన్ని రకాల మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన, డిబేట్, పోటీలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, డీఏఓ అఫ్జల్ బేగం, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.