by Suryaa Desk | Sun, Sep 22, 2024, 06:52 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు ఇళ్లకు చెందిన 6 ఏళ్ల బాలికలపై కన్నేసిన 17 ఏళ్ల ఓ బాలుడు.. వారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముగ్గురు బాలికలను గదిలోకి తీసుకెళ్లి, ఇద్దరిపై అఘాయిత్యానికి పాల్పడగా.. మూడో బాలిక తప్పించుకొని పారిపోయి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కులంలోనే పరిష్కరించుకోవాలని పెద్దలు తీర్మానించడంతో విషయం బయటకి రాలేదు.
ఆరేళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు 17 ఏళ్ల ఓ బాలుడు. సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తూ, మద్యానికి బానిసై.. ఇరుగుపొరుగున ఉండే చిన్నారుల పైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యవనాలకు బానిసైన మైనర్ బాలుడు.. పొరుగింటి ఆడపిల్లలపైనే కన్నేశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికలకు మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడో బాలిక తప్పించుకొని పారిపోయింది. తల్లిదండ్రులకు ఆ దారుణం గురించి చెప్పింది.
బాధిత బాలికల తల్లిదండ్రులు కులపెద్దలను ఆశ్రయించడంతో.. అదే రోజు రాత్రి పంచాయితీ నిర్వహించారు. నిందితుడు, బాధితులు.. అందరూ ఒకే కులం వారు కావడంతో విషయం బయటకు పొక్కకూడదని తీర్మానించారు. కులంలోనే పరిష్కరించుకోవాలని హుకుం జారీ చేశారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే, కుల బహిష్కరణ చేస్తామని బాధిత కుటుంబాలను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అయితే, ఆ నోటా, ఈ నోటా విషయం బయటికి వచ్చింది. ఐసీడీఎస్ అధికారుల దృష్టికి రావడంతో.. వారు శనివారం (సెప్టెంబర్ 21) గ్రామంలో విచారణకు వచ్చారు. అయితే, గ్రామస్థులెవరూ సహకరించలేదు. కులపెద్దల హెచ్చరికలతో బాధిత కుటుంబాలు నోరు మెదపలేదు.
ఐసీడీఎస్ అధికారులు వెళ్లిపోయిన తర్వాత.. ఆ బృందంలోని ఓ అధికారి చెప్పిన మాటలు బాధిత కుటుంబాల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ధైర్యం తెచ్చుకొని ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.