|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 05:54 PM
ఎండా కాలం మొదలైంది. తెలంగాణలో భానుడ భగభగా మండిపోతున్నాడు. వేసవి కాలం మొదట్లోనే అధిక ఉష్ణోగ్రతలతో నిప్పులు కురిపిస్తున్నాడు. బయట ఎండలు, వేడిగాలులు.. ఇంట్లో ఉక్కపోతతో జనాలు ఇప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇన్ని రోజులు మూలకు పడిన కూలర్లను జనాలు బయటికి తీసి నీళ్లు నింపేస్తున్నారు. ఏసీల వాడకం కూడా పెరిగిపోయింది. ఈ పరిణామాలన్నింటితో.. రాష్ట్రంలో విద్యుత్ వాడకం కూడా గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొందరైతే.. విద్యుత్ ఛార్జీల పెంచేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని.. సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టటమే తరువాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ వార్తలపై టీజీఎస్పీడీసీఎల్ స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చింది.
ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పందించారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని ముషారఫ్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు (మార్చి 21న) విద్యుత్ నియంత్రణ భవన్లో ఈఆర్సీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన విచారణ కార్యక్రమంలో ఈ విషయంపై ముషారఫ్ ఫారూఖీ స్పందించారు. టీజీపీఎస్సీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజయ్యారు.
మరోవైపు.. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని గురువారం (మార్చి 20న) ఎన్పీడీసీఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు టీజీఎస్పీడీసీఎల్ కూడా విద్యుత్ పెంపుపై క్లారిటీ ఇవ్వటంతో.. ఈఏడాది ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టమవుతోంది. దీంతో.. సామాన్య ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకోనున్నారు.
అసలే ఎండా కాలం.. అందులోనూ రోజంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడుస్తుంటే.. సాధారణంగానే విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడవుతుంటాయి. మరి ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇంకేమైనా ఉందా..? బయట భానుడి భగభగలకంటే.. కరెంట్ బిల్లులే మండిపోతాయని సామాన్యులు బెంబేలెత్తిపోయారు. అయితే.. విద్యుత్ సంస్థలు క్లారిటీ ఇవ్వటంతో.. ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టమైపోయింది. దీంతో.. సామాన్యులు కాస్త ఉపశమనం పొందినట్టయింది.