|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 05:58 PM
అన్నిదానాల కంటే అన్నదానం గొప్పది అని చెబుతుంటారు. ఆకలితో ఇబ్బంది పడేవారికి కాస్త అన్నం పెడితే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేనిది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో భోజనం చేయాలంటే భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఒకప్పుడు ఫుల్ భోజనం రూ.50 ఉండగా.. ప్రస్తుతం రూ.90 నుంచి రూ.100 మధ్య ధరలు పెరిగాయి. ఇంత పెద్ద మొత్తం కార్మికులు, రోజూ వారీ కూలీకి వెళ్లే వారికి భారంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం రూ.5 భోజనం కల్పిస్తున్నా.. వాటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే సికింద్రాబాద్ లో అన్నార్థుల ఆకలి తీర్చే ఉద్దేశ్యంతో కేవలం రూ.1 కే భోజనం పెడుతున్నారు. నగరానికి ఎంతో మంది కూలీ కోసం పొట్ట చేతపట్టుకొని వస్తారు. రోజూ వారి కూలీ చేసేవారికి ఆ రోజు పని దొరక్కపోతే అంతే ఇక. వారంతా సికింద్రాబాద్ ప్రాతంలో మధ్యాహ్నం 12 గంటలకు అక్కడకు చేరుకుంటారు. అయితే అక్కడ వాళ్లందరి ఆకలి తీర్చేవారు ఎవరు..? దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సికింద్రాబాద్ ఏరియాలో మనోహర్ టాకీస్ సమీపంలో ఉండే.. ‘కరుణ చికెన్’ భోజనం చేసే వారికి వేదిక. అక్కడ కార్మికులకు నెలన్నర రోజుల నుంచి కేవలం ఒక్క రూపాయికే భోజనం కల్పిస్తోంది. ఇలా గుడ్ సమ్మరిటీస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ తన దాతృత్వాన్ని చాటుతోంది. ఇక్కడ జార్జ్ రాకేశ్ బాబు ఆధ్వర్యంలో రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నగరానికి వచ్చే వారి ఆకలి తీర్చడంతో ఆ సంతృప్తి వేరేగా ఉంటుందని అతడు చెబుతున్నాడు. అందుకే ఇలా ఒక్క రూపాయికి మాత్రమే భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ పని చేయడానికి తనకు స్పూర్తి క్రికెటర్ గౌతమ్ గంభీర్ అని చెప్పాడు. అతడు కూడా ఒక్క రూపాయికే భోజనం పెట్టడం మమ్మల్ని ఆకట్టుకుందన్నారు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే హైదరాబాద్లో ఒక్క రూపాయికే భోజనం పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. వలస కార్మికులకు హైదరాబాద్ ఓ అడ్డాగా మారింది. ఎక్కడ నుంచో ఇక్కడకు వచ్చి ఏదో ఒక పని చేసుకొని వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అయితే వీరందరికీ మేము చేసే ఈ ప్రయత్నం గురించి తెలుస్తుందో.. లేదో అనుకున్నాం.. కానీ.. అంతకుమించి స్పందన వస్తుందన్నారు. భోజనం తిన్న వారు బాగుందని ఒక్క మాట చెబితే.. మాకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం నగరంలో ఒక్క ప్రాంతంలోనే భోజనం పెడుతున్నామని.. భవిష్యత్లో దీనిని నగరంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.