by Suryaa Desk | Wed, Sep 25, 2024, 10:51 AM
అనూహ్యంగా రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య రాజీనామా చేసిన అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే ఆయన పొలిటికల్గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై అటు ప్రజల్లో..రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆయన బీజేపీ లో చేరబోతున్నారని, ఇప్పటికే అందుకు సంబంధించి సంప్రదింపులు కూడా పూర్తయినట్లుగా సోషల్ మీడియా లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని బీసీలను సంఘటితం చేస్తూ ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆయా అంశాలపై ఆర్ కృష్ణయ్య క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెట్టాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నుంచి తనపై ఒత్తిడి ఉందని స్పష్టం చేశారు. అయితే, నాలుగేళ్ల క్రితమే తనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని అన్నారు. ఆనాడే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం వెనుక ఎలాంటి రాజకీయం లేదని కొట్టి పడేశారు. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు ఉన్నాయని అన్నారు. కొత్త పార్టీ పెట్టడమా లేక ఏదైనా పార్టీలో చేరడమా అన్ని విషయంపై బీసీ సంఘాల నాయకులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని ఆర్ కృష్ణయ్య క్లారిటీ ఇచ్చారు.