by Suryaa Desk | Tue, Sep 24, 2024, 04:38 PM
తిరుపతి లడ్డు కల్తీ అంశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలైనా ఇస్తానని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.సెక్యూలరిజం అంటే వన్ వే మాత్రమే కాదని ఇది టూ వే అంటూ తీవ్ర స్థాయిలో పవన్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ పవన్ కల్యాణ్ కు మద్దతు ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు అండగా నిలబడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఎవరైనా సనాతన ధర్మాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే హిందువలమైన మనందరం న్యాయబద్ధంగా గళం విప్పుతామన్నారు. సెక్యూలరిజం టూ వే మార్గం అని తమ జోలికి వస్తే మౌనంగా ఉండబోమన్నారు. ఈ సందర్భంగా.."పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||" అనే శ్లోకాన్ని పోస్టు చేశారు.