by Suryaa Desk | Mon, Sep 23, 2024, 03:21 PM
రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1977, 78, 79 బ్యాచ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాట్సప్ వేదికగా గత కొంత కాలం నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు.
చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం మృతి చెందిన గురువులు, స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గురువులు నర్సింహారెడ్డి, కొండల్రెడ్డి, మృత్యుంజయశర్మ, లింగారెడ్డి, వైకుంఠం, మల్లారెడ్డితోపాటు పూర్వ విద్యార్థులు మామిడి బాల్ రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, రాజేశం, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అంజయ్య, ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.