![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 05:49 PM
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తమ సొంత పార్టీ నేతలపైనే కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని కొంత మంది నేతలు బయటికి వెళ్లిపోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాజాసింగ్ జోస్యం చెప్పుకొచ్చారు. అలా జరగాలంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలంటూ హాట్ కామెంట్స్ చేశారు.
కొంత మంది నేతలు పార్టీ వాళ్లదే అన్నట్టుగా భావిస్తున్నారని.. వారంతా కొన్ని సామాజిక వర్గాలకు చెందినవాళ్లేనని.. వాళ్లందరినీ బయటకు పంపిచేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయంటూ రాజాసింగ్ సంచలన లేఖ విడుదల చేశారు. అధిష్ఠానం ఈ విషయంపై ఫోకస్ పెట్టాలని లేఖలో కోరారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని కొంత మంది నేతలు సీక్రెట్గా కలుస్తారంటూ కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నవారి వివరాలు తనకు తెలుసని.. వారిపై త్వరలోనే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు రాజాసింగ్ తన లేఖలో పేర్కొన్నారు. కాగా.. రాజాసింగ్ లేఖపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా రాజాసింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలీ పండుగ వేళ ఆంక్షలు విధించటంపై మండిపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో నిజాం పాలనను తలపించేలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాంలా వ్యవహరిస్తున్నారు.
"హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా..? హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు..? రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు కూడా పడుతుంది." అని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు రాజాసింగ్ వీడియో విడుదల చేశారు.