![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 01:55 PM
హైదరాబాద్ సరూర్నగర్ పరిధిలో జరిగిన అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అప్సర (30) అనే యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన పూజారి వెంకట సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. ఇరువైపులా వాదనలు విన్న రంగారెడ్డి కోర్టు ఈ మేరకు బుధవారం నాడు తీర్పును వెల్లడించింది. పూజారి సాయికృష్ణ పని చేసే ఆలయానికి వచ్చే క్రమంలో అప్సరకు అతడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర తరచూ సాయికృ ష్ణపై ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నా సాయికృష్ణ ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం 2023 జూన్ 3న కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ మండలంలోని సుల్తాన్పల్లి శివారులోని గోశాల వైపు సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. కారులోనే గాఢనిద్రలో ఉన్న అప్సర ముఖంపై ప్లాస్టిక్ కవర్తో కప్పి ఊపిరి ఆడకుండా చేసి చంపాలని చూశాడు. కానీ, ఆమె ప్రతిఘటించడంతో తన వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో అక్కడిక్కడే చనిపోయింది.ఆ తర్వాత అప్సర మృతదేహాన్ని సరూర్నగర్ ఎమ్మా ర్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్హోల్లో పడేశాడు. కూతురు కనిపించకపోవడంతో అప్సర తల్లి అరుణ సాయికృష్ణతో కలిసి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కానీ, సాయికృష్ణ వ్యవహరశైలిపై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో నేరాన్ని అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఈరోజు నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.