|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 09:19 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగేందుకు ముహూర్తం దగ్గరపడుతోంది. ఎన్నికలను అత్యంత పారదర్శకగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. శనివారం హైదరాబాద్లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో సాధారణ, వ్యయ పరిశీలకులకు వారి విధులపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఖర్చుల నియంత్రణ, ప్రవర్తనా నియమావళి అమలు, క్షేత్రస్థాయిలో తలెత్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అధికారులకు అవగాహన కల్పించారు. మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి, ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన సాంకేతిక అంశాలను వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష శిక్షణ అనంతరం రాణి కుముదిని 32 జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మౌలిక సదుపాయాలతో కూడిన కేంద్రాల గుర్తింపు, సున్నితమైన ప్రాంతాల మ్యాపింగ్, బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు, ఇతర సామగ్రిని సిద్ధం చేయడంపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, శాంతిభద్రతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎస్ఈసీ సర్వం సిద్ధం చేసింది. రాబోయే వారం రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఓటర్ల జాబితా సవరణ, వార్డుల వారీగా ఓటర్ల విభజన ఇప్పటికే పూర్తి కావడంతో అధికారులు ఇప్పుడు క్షేత్రస్థాయి పనులపై దృష్టి సారించారు. కాగా, మున్సిపల్ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు ఉవ్విలూరుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ అదే ఊపును ఈ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది.