|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:41 PM
హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలిలో భారీ హిమపాతం కారణంగా పరిస్థితులు భయానకంగా మారాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న మంచు, వారాంతపు సెలవులతో పోటెత్తిన పర్యాటకుల తాకిడితో కులు-మనాలి జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వేలాది మంది పర్యాటకులు గడ్డకట్టే చలిలో రాత్రంతా తమ వాహనాల్లోనే చిక్కుకుపోయారు. ఈ ట్రాఫిక్ జామ్లో ఓ అంబులెన్స్ చిక్కుకుపోవడంతో, అందులో ఉన్న సుశీల్ కుమార్ అనే గుండె సంబంధిత రోగి సమయానికి ఆసుపత్రికి చేరలేక ప్రాణాలు కోల్పోయారు.దాదాపు మూడు నెలల తర్వాత సీజన్లో తొలిసారిగా భారీ హిమపాతం నమోదు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో మనాలికి బయలుదేరారు. పత్లికుల్-మనాలి మధ్య సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై రెండు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం, ట్రాఫిక్లో చిక్కుకున్న వారికి ఆహారం, నీరు అందించి సహాయక చర్యలు చేపట్టింది. మంచును తొలగించే పనులు కొనసాగుతున్నాయి.