|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:37 PM
ఆ నిరుపేద తల్లిదండ్రులు తమ బిడ్డ చదువుకొని గొప్ప ప్రయోజకురాలు అవుతుందని ఆశపడ్డారు. పస్తులున్నా సరే.. గురుకుల పాఠశాలలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మారు. కానీ.. అదే నమ్మకం ఆ చిన్నారి ప్రాణాల మీదకు తెస్తుందని వారు కలలో కూడా ఊహించలేదు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఘోరం ఘటన విద్యా వ్యవస్థకే మచ్చగా మారింది.
అసలేం జరిగిందంటే..
మద్నూర్ మండలం కొడిచిర గ్రామానికి చెందిన సంగీత అనే బాలిక ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పాఠాలు బోధించి, సంరక్షించాల్సిన ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ సునీత.. నిబంధనలకు విరుద్ధంగా తన సొంత ఇంటి పని కోసం విద్యార్థినిని వాడుకున్నారు. తన ఇంట్లో జరిగిన ఒక వేడుక కోసం పాఠశాలకు చెందిన ఫర్నిచర్ను తరలించేందుకు సంగీతను ఆటోలో పంపించారు. తిరిగి వస్తున్న క్రమంలో.. ఫర్నిచర్ మధ్యలో కూర్చున్న సంగీత ఆటో నుంచి ప్రమాదవశాత్తు కిందకు జారిపడింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆ విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థిని సంగీత మరణవార్త విన్న తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద కుప్పకూలిపోయారు. ‘చదువుకోవడానికి పంపితే.. పని పిల్లలా మార్చి నా బిడ్డను పొట్టనబెట్టుకుంటారా..? అంటూ వారు ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురుకుల పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఆటో నుంచి సంగీత పడిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమవ్వడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ ఘటనతో బోర్లం క్యాంప్ గురుకులంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. విచారణకు ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ప్రాణం బలికావడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.