![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 08:08 PM
వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్లకు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టడానికి దమ్ము ఉండాలని ఆయన అన్నారు.దేవాలయాలు, రైతులు, పేద ప్రజల భూములను వక్ఫ్ బోర్డు నోటీసు పంపించి కబ్జా చేసిందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డుకు భూములు ఇవ్వాలనే నిర్ణయాన్ని కేంద్రం తెచ్చిన బిల్లు ద్వారా ఆపవచ్చని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన ఆకాశ్పురి హనుమాన్ దేవాలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు ఈ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.2010 నుంచి తన ఆధ్వర్యంలో శోభాయాత్ర జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పదిహేనేళ్లలో ఏ సంవత్సరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది రామభక్తులు భక్తితో పాల్గొంటుంటారని, క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. ఈ శోభా యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు.