|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:53 PM
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ సాధారణంగానే సాగుతోంది. అయితే సంగారెడ్డిలో మాత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్న ఓ పోలీస్.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల దురుసుగా ప్రవర్తించారని.. పైగా అతని కాలర్ పట్టుకున్నారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. ఆందోళనకు దిగడం పెను దుమారం రేపింది. పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు పోలింగ్ స్టేషన్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. 34 వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పట్ల.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ (సీఐ) కాలర్ పట్టుకున్నారని ఆరోపించిన.. జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని తీవ్రంగా మండిపడ్డారు. పోలింగ్ జరగకుండా ఆపేస్తామని పేర్కొంటూ బలవంతంగా బూత్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో.. అక్కడ తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
దీంతో ఆ పోలింగ్ స్టేషన్ వద్దకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి రావడంతో అక్కడ పరిస్థితులు హీటెక్కాయి. 34వ వార్డులో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించగా.. దానికి సీఐ శివకుమార్ సపోర్ట్ చేస్తున్నారని.. జగ్గారెడ్డి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్కు సహకరిస్తున్న సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను సస్పెండ్ చేయకపోతే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డికి నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో సంగారెడ్డిలో శాంతి భద్రతల సమస్య ఎదురైతే దానికి సీఐ శివకుమార్, హోంగార్డ్లే కారణం అని మండిపడ్డారు. పోలీసులపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.