|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 12:20 PM
వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా విధానాన్ని, ప్రస్తుత డిమాండ్-సప్లై పరిస్థితులను, వివిధ జలాశయాలలో ఉన్న నీటి నిల్వలు, పంపింగ్ సామర్థ్యం, పంపిణీ వ్యవస్థ తదితర అంశాలపై ట్రాన్స్మిషన్, ఓఅండ్ఎమ్ విభాగాల ఉన్నతాధికారులతో ఎండీ సమీక్షించారు. ఎండీ మాట్లాడుతూ.. రాబోయే 60 రోజులు తాగునీరు సరఫరా చేసేందుకు క్షేత్ర స్థాయిలో అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలకు కేటాయించే నీటి సరఫరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా సప్లైలో తక్కవ నీరుంటే.. సర్దుబాటు చేసే లాగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నీటి సరఫరా చేసేటప్పుడు సమయ పాలన పాటించాలన్నారు. ఒకవేళ అందులో ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగా ప్రజలకు సమాచారమివ్వాలని తెలిపారు.
అలాగే అంగీకరించిన నీటిని సరఫరా కంటే అందనగా సప్లై అవుతున్న నీటిని తగ్గించి తక్కువగా అందుతున్న ప్రాంతాలను గుర్తించి , సమతుల్య పంపిణీకి తక్షణ చర్యలు చేపట్టాలని ట్రాన్స్ మిషన్ అధికారులను ఆదేశించారు. అధికంగా నీరు అందుతున్న ప్రాంతాల్లో సరఫరాను సర్దుబాటు చేసి, తక్కువగా అందుతున్న ప్రాంతాలకు మళ్లించడం ద్వారా ప్రతి ప్రాంతానికి సమానంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల వాల్వ్ ఆపరేషన్లు పునఃసమీక్షించి, సప్లై సమయాలను పునర్వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు.అలాగే, లీకేజీలు, అనధికార కనెక్షన్లు, నీటి వృధాను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఎండీ ఆదేశించారు. పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు, కీలక సరఫరా లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించాలన్నారు.
వేసవిని దృష్టిలో పెట్టుకుని డిమాండును అంచనా వేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. నగరంలో ఇప్పటికే 1250 ట్యాంకర్లు, 90 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు, 145 ఫిల్లింగ్ పాయింట్స్ ఉండగా.. డిమాండ్ ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ప్రతి జీఎం.. సక్రమ నీటి సరఫరాకు ట్రాన్స్ మిషన్ అధికారుల సమన్వయంతో ఇన్ ఫ్లో ను పర్యవేక్షించాలని తెలిపారు.
అలాగే డిమాండ్ ను తట్టుకునేందుకు వీలుగా.. ఇక నుంచి రాత్రి సమయాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు.. రాత్రి వేళ కమర్షియల్ అవసరాలకు ట్యాంకర్లను డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుకోవాలని సూచించారు.ప్రజలు జలమండలి సరఫరా చేసే నీటిని త్రాగటానికి కాకుండా ప్రాంగణాలు, వాహనాలు కడగడానికి.. ఇతర అవసరాలకు నీటిని వృధా చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని.. అలాగే తాగునీటి సరఫరా సమయాల్లో కొంత మంది మోటార్లతో నీటిని తోడుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జలమండలి ఈడీ సామ్రాట్ అశోక్, ఆపరేషన్ డైరెక్టర్, నారాయణ, సీజీఎంలు, రెవిన్యూ, ఐటీ విభాగపు అధికారులు పాల్గొన్నారు.