|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 04:14 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటరు మహాశయులకు నమస్కారం అంటూ ఎక్స్ వేదికగా ఓటర్లను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.గత 12 ఏళ్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం పట్టణాలు కనీసం వీధి లైట్లకు కూడా నోచుకోని దుస్థితికి చేరుకున్నాయని, ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ప్రజాధనాన్ని కొల్లగొట్టడం, మజ్లిస్-మైనార్టీ ఓట్లపై దృష్టి పెట్టడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఏమాత్రం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి అండగా నిలవాలని, మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.