|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 06:11 PM
తెలంగాణలోని పత్తి రైతులకు గుడ్న్యూస్. పత్తి కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీపికబురు అందించింది. ప్రస్తుతం రైతుల వద్ద నిలువ ఉన్న, లేట్ క్రాఫ్ ద్వారా సేకరిస్తున్న పత్తిని కొనుగోళ్లను పొడిగించింది. నిజానికి ఈనెల 22తో సీసీఐ పత్తి కొనుగోళ్లు ముగియాల్సి ఉంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తాజాగా సీసీఐ నిర్ణయం తీసుకుంది. మంత్రి తుమ్మల ఆదేశాలతో నిన్న వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర జౌళి శాఖకు ప్రత్యేకంగా లెటర్ రాశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం, సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పొడిగించిన గడువును వినియోగించుకొని రైతులు పత్తిని అమ్ముకోవాలని మంత్రి విజ్ఙప్తి చేశారు. కాగా రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి తుమ్మల కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సీసీఐ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా నేటి నుంచి తెలంగాణలో సీసీఐ కొనుగోలు కేంద్రాని ముసివేస్తామని ముందుగా అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దళారులను ఆశ్రయిస్తే గిట్టుబాటు కాదని.. ధర తక్కువ వస్తుందని బయపడ్డారు. నిజానికి ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి సీసీఐ తేమ పేరిట కోతలు విధించి రైతులను ఇబ్బందులకు గురి చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. పత్తికి మద్దతు ధర సీసీఐ కొనుగోళ్ల ప్రారంభంలో రూ. 8110 ఉండగా తేమ పేరుతో భారీగా కోత విధించడారు. దీంతో చాలా మంది రైతులకు సరైన మద్దతు ధర లభించలేదు.
దీంతో తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఏడాది అకాల వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గింది. దానికి తోడు పంట కూడా ఆలస్యంగా చేతికొచ్చింది. ప్రతి ఏడాది మార్చి వరకు కొనుగోలు చేసే సీసీఐ అధికారులు ఈసారి ముందుగానే కొనుగోలు కేంద్రాలను మూసివేసేందుకు నిర్ణయించుకోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సీసీఐ తాజా నిర్ణయం రైతుల్లో ఆనందాన్ని నింపింది.