by Suryaa Desk | Fri, Jul 12, 2024, 09:08 PM
వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.. వచ్చే నెలలో ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాన నగరాల మధ్య విడతలవారీ ఈ రైళ్లను పట్టాలెక్కించుకున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు సికంద్రాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తొలి వందేభారత్ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబైకు నడిపే ఛాన్స్ ఉందంటున్నారు. సికింద్రాబాద్ నుంచి ముంబైకు వందేభారత్ రైలు సర్వీస్ లేదు.. అందుకే ఈ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబైకు నడిపే ఆలోచనలో ఉన్నారట.
సికింద్రాబాద్-ముంబై మధ్య వందే భారత్ రైలు లేకపోవడంతో.. తొలి స్లీపర్ రైలును ఈ రూట్లో నడపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదననలను దక్షిణ మధ్య రైల్వేకు, రైల్వే బోర్డుకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు సికింద్రాబాద్ - పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ స్లీపర్ రైలు ఏ మార్గంలో నడపాలనే అంశంపై రైల్వేశాఖ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో రెండు రైళ్లకు సంబంధించి మార్పులు, చేర్పులపై రైల్వే అధికారులతో చర్చించి ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధమయ్యారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి - నిజామాబాద్ల మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. అయితే నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం ఖాళీ లేక బోధన్ వరకు ఈ రైలును తీసుకెళుతున్నారు. ఈ రైలును బయల్దేరే ముందు బోధన్ నుంచి నిజామాబాద్కు తీసుకువస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ - రాజ్కోట్ల మధ్య రాజ్కోట్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది. అయితే హైదరాబాద్లో గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన ఎక్కువమంది ఉన్నారు. దీంతో ఈ రాజ్కోట్ ఎక్స్ప్రెస్ను కచ్ వరకు నడపాలని డిమాండ్ వినిపిస్తోంది.
కేందమంత్రి కిషన్ రెడ్డి ఈ రెండు అంశాలపై సమీక్ష చేశారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు.. అలాగే రాజ్కోట్ ఎక్స్ప్రెస్ను కచ్ వరకు పొడిగించే అంశంపై చర్చించారు. ఈ రెండు ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే కాచిగూడ-బెంగళూరు మధ్య నడుస్తున్న వందేభారత్కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 8 కోచ్లతో నడుస్తున్న ఈ రైలులో 16 కోచ్లకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఇటు చర్లపల్లి టెర్మినల్ పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై ఫోకస్ పెట్టారు. ప్రధాని మోదీ ఈ టెర్మినల్ను ప్రారంభిస్తారని చెబుతున్నారు.