|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 07:48 PM
హైదరాబాద్ లోని అనేక వారసత్వ కట్టడాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ వేదకుమార్ అన్నారు. చారిత్రక కట్టడాల చుట్టూ 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ... అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రపంచ వారసత్వ హోదాకు చార్మినార్ కు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ... చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాల కారణంగా అది సాకారం కావడం లేదని తెలిపారు. చార్మినార్ ప్రాంతంలో పురాతన కట్టడాలకు ముప్పు వాటిల్లేలా వాటి చుట్టూ నిర్మాణాలు సాగుతున్నాయని వేదకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాడ్ బజార్, సర్దార్ మహల్, చార్ కమాన్ చుట్టు కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని చెప్పారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని చార్మినార్ వద్ద ఆయన హెరిటేజ్ వాక్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పురాతన కట్టడాలు చారిత్రక ఆనవాళ్లని చెప్పారు. వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించుకునేందుకు అందరం కలసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.