|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 08:31 PM
సాధారణంగా.. భర్త వేధింపులు భరించలేకో, ప్రియుని చేతిలో మోసపోయో, భర్త తనకు తెలియకుండా చిన్నిల్లు పెట్టాడనో.. ఇలా రకరకాల సందర్భాల్లో న్యాయం కోసం భార్యలు రోడ్డెక్కుతుంటారు. భర్తల ఇండ్ల ముందు ధర్నాలు చేస్తుంటారు. వారికి మహిళ సంఘాలు కూడా మద్దతు తెలుపుతుంటాయి. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలే వార్తల్లో వచ్చేవి. కానీ.. ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయ్యింది. ఓ భర్త తన భార్య కోసం తన అత్తగారింటి ముందు ధర్నాకు దిగాడు. అంతేకాదండోయ్.. ఆ భర్తకు మహిళా సంఘాలు కూడా మద్దతు తెలపటం గమనార్హం. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది మరి..!
జగిత్యాల జిల్లా కోరుట్లలోని ప్రకాశం రోడ్డుకు చెందిన గాజుల అజయ్ అనే భర్త తన భార్య శివాని కోసం రోడ్డెక్కాడు. కొన్ని రోజుల కిందట.. ఇద్దరి మధ్య చిన్నగా గొడవ జరగ్గా.. శివాని తన రెండేళ్ల బాబుతో కలిసి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక్క అప్పటి నుంచి ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి అజయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. పెద్ద మనుషులతో కూడా చెప్పించాడు. వాళ్లు నచ్చజెప్పినా శివాని మనసు మాత్రం మారలేదు. "ఇకపై నిన్ను ఏమీ అనను, బాగా చూసుకుంటాను." అంటూ అజయ్ ప్రాధేయపడుతున్నా శివాని మాత్రం రాలేనని తేల్చి చెప్పేసింది.
చివరికి విసిగిపోయిన అజయ్ ఏ భర్త తీసుకోని నిర్ణయమే తీసుకున్నాడు. మహిళా సంఘాల మద్దతు కూడగట్టుకొని ఏకంగా తన అత్తగారి ఇంటి ముందే బైఠాయించి ఆందోళన మొదలుపెట్టాడు. మహిళా సంఘాలు కూడా ఈ వింత పోరాటంలో అజయ్కి అండగా నిలవడం విశేషం..!
అయితే, శివాని మాత్రం తన భర్త ఇంటికి వెళ్లేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. "అక్కడ నాకు రక్షణ లేదు. అతను నిత్యం నన్ను వేధిస్తాడు, చాలా ఇబ్బంది పెడతాడు." అంటూ తన గోడు వెళ్లబోసుకుంటోంది. భార్య బెట్టు వీడకపోవడంతో అజయ్ చాలాసేపటి తర్వాత నిరాశగా అక్కడి నుంచి కదిలాడు.
ఈ తతంగాన్ని చూసిన కోరుట్ల జనాలు మాత్రం నోరెళ్లబెట్టారు. భర్త తన భార్య కోసం ధర్నా చేయడం ఇదే తొలిసారి అని ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఇప్పటికైనా శివాని మనసు కరుగుతుందో లేదో చూడాలి. మొత్తానికి ఈ రివర్స్ స్టోరీ కోరుట్ల టౌన్లో హాట్ టాపిక్గా మారింది..!