|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:12 PM
డ్రైవింగ్ లెసెన్స్ లేకున్నా బైక్ పై దూసుకెళుతున్నారా.. మైనర్లు, లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చి పంపిస్తున్నారా.. ఇకపై ఇలా కుదరదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కారంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారి వల్లే రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం చోటుచేసుకుంటున్నాయని, దీనిని నివారించేందుకు తనిఖీలు చేపట్టనున్నామని వివరించారు.మార్చి 1 నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరం ‘స్పెషల్ డ్రైవ్’ చేపట్టబోతున్నట్లు తెలిపారు. తనిఖీలలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వెంటనే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, ఆ తర్వాతే వాహనం నడపాలని హితవు పలికారు. వాహనం నడుపుతూ బయటకు వస్తే తప్పనిసరిగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు.లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనం ఇవ్వొద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహనం నడిపే అర్హత లేని వారికి వాహనాలు ఇవ్వడం నేరమని చెబుతున్నారు. మీ వాహనంతో వారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఎలాంటి పరిహారం రాదని గుర్తుచేశారు. దీనివల్ల ఆర్థిక భారంతో పాటు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.