![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 07:46 PM
ఇందిరమ్మ ఇళ్ల రెండు విడతల్లో కలిపి 4.50 లక్షల మంది లబ్ధిదారులతో జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే జూన్ నాటికి పిల్లర్లు వరకు నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమచేయాలని సర్కారు యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. అలా 72 వేల మంది లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. మొదటి విడతలో కొన్ని తప్పులు జరిగాయని గుర్తించారు అధికారులు.
వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున 72 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. కానీ, అందులో చాలా మంది అనర్హులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. అందులో నుంచి 42 వేల మందికే ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు. మిగిలిన 30 వేల మందిపై మళ్లీ విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో తప్పులు జరగకుండా చూడాలని జిల్లా అధికారులకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు సిబ్బందికి మార్గదర్శకాలు ఇచ్చారు. ‘రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టాలని’ అధికారులు తెలిపారు.
అందుకే.. ఈసారి జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు. జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాలను వదిలి.. మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జాబితాలు అందాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సలహాలు కూడా తీసుకుంటున్నారు.
మొత్తం రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఇళ్ల పునాది, పిల్లర్ల వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.