|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 01:18 PM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందుకు తీసుకురావడంలో భాగంగానే బీజేపీ మహా కుంభమేళాను ఉపయోగించుకోవాలని కుట్ర పన్నిందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రయాగ్రాజ్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతం, కులం పేరుతో సమాజంలో చీలికలు సృష్టించేందుకు పక్కా ప్రణాళికతో నిధులు ఖర్చు చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. "మహా కుంభమేళా సమయంలో యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనేది వారి (బీజేపీ) ప్రణాళిక అని మాకు తెలిసింది. వారు దీనిని రాజకీయ కుంభ్గా మార్చాలని కోరుకున్నారు. ఇది మతపరమైన కుంభ్ కాదు" అని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. "నిజానికి మతాల మధ్య చిచ్చు పెడుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీనే. మతం, కులం పేరుతో సమాజంలో విభజన సృష్టించడం బీజేపీ చాలా ప్రణాళికాబద్ధంగా చేస్తున్న కార్యక్రమం, దాని కోసం వారు నిధులు కూడా ఖర్చు చేస్తారు. ఇప్పుడు చెప్పినదంతా బీజేపీ ఆలోచనా విధానమే" అని అఖిలేశ్ వివరించారు.