|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 12:57 PM
రామచంద్రాపురం : రామచంద్రపురం డివిజన్ పరిధిలో బిహెచ్ఇఎల్ భూములకు సంబంధించి నెలకొన్న వివాదాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బిహెచ్ఇఎల్ ఈడి భరణి రాజాకు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం బీహెచ్ఈఎల్ పరిశ్రమలోని అడ్మిన్ కార్యాలయంలో రామచంద్రాపురం డివిజన్ సంబంధించిన ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులతో కలిసి యాజమాన్యంతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ప్రధానంగా.. ఈఎస్ఐ చర్చి సమీపంలో గల బీరప్ప గుడిని బిహెచ్ఇయల్ పరిశ్రమ భూమిలో ఉందంటూ సంబంధిత అధికారులు తొలగించడం జరిగిందని తెలిపారు. దీంతో పాటు బాంబే కాలనీ సమీపంలో ప్రహరీకి అనుకొని గత దశాబ్దాల కాలంగా స్థానిక పాడి రైతులు పశువుల కొటాలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. వీటిని సైతం తొలగించాలని ఇటీవల బెల్ అధికారులు నోటీసులు అందించారని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. రాయసముద్రం చెరువు సమీపంలో గల మసీదు నిర్మాణం సైతం బెల్ పరిధిలో ఉందంటూ అధికారులు ఇటీవల తాకీదులు జారీ చేశారని పేర్కొన్నారు. పై మూడు అంశాల్లో యాజమాన్యం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా బీరప్ప గుడి అంశంలో కూల్చివేసిన స్థానంలో తిరిగి దేవాలయం నిర్మించడంతోపాటు విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. పాడి రైతుల అంశంలో మానవీయ కోణంలో స్పందించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బెల్ ఈడి భరణి రాజా.. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, కురుమ సంఘం అధ్యక్షులు నరసింహ, పుర ప్రముఖులు ఊరెళ్ళ రాజు, ఐలేష్, కరిక సత్యనారాయణ, అంజన్న, యాదగిరి, గోవింద్, మల్లేష్, కుమార్, నరసింహ, లక్ష్మణ్, రవి తదితరులు పాల్గొన్నారు.